బ్రహ్మంగారిమఠం మండలంలో సతీష్, ఓబులేసు అనే ఇద్దరు దళిత యువకుల మరణాలు ప్రమాదవశాత్తు జరిగినవి కావని, అవి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన “అంతర్కుల ప్రేమ హత్యలు” అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. బుధవారం ఆయన కడప ఎస్పీని కలిసి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని వినతి పత్రం అందజేశారు.
తక్కువ కులం యువకుడు తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కక్షతోనే అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు యువకులు మోకాళ్ళ లోతు నీళ్లలో చనిపోయే అవకాశం లేదని, ఒక మృతదేహం దగ్గర దొరకాల్సిన వస్తువులు 3 కిలోమీటర్ల దూరంలో దొరకడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.మద్యం తాగి కాలువలో పడి చనిపోయారని తప్పుడు రిపోర్టులు రాసి, బంధువుల దగ్గర సంతకాలు తీసుకున్న SIపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే నిందితులకు మద్దతు ఇస్తున్నారని, సంతోష్ అనే మరో యువకుడు ఇప్పటికీ కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోందని మందకృష్ణ తెలిపారు.
