రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కలకలం రేగింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యక్తిగత సహాయకుడు (PA) వెంగళ దినేష్ గౌడ్ భార్య రోహిణి (32) బుధవారం తన నివాసంలో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే, ఇది ఆత్మహత్య కాదు.. దినేష్ గౌడ్ మరియు అతని కుటుంబసభ్యులే రోహిణిని చంపేసి ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

దినేష్ గౌడ్ ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, గత కొంతకాలంగా రోహిణిని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని బంధువులు తెలిపారు. రోహిణి చనిపోయిన తర్వాత తన పలుకుబడిని ఉపయోగించి దినేష్ గౌడ్ సుమారు 60 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయించుకుని తమను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండతో, డబ్బు బలంతో ఈ కేసును ఆత్మహత్యగా క్లోజ్ చేయించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోహిణి ఒంటిపై పలుచోట్ల గాయాలు ఉండటం హత్య అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
