ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల వ్యవహారం కామారెడ్డిలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కళాశాల స్థలం విషయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి.
శనివారం ఉదయం 10 గంటలకు సరస్వతి శిశుమందిర్ వద్ద ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరస్పరం సవాల్ విసురుకున్నారు. ఈ క్రమంలో ఎన్ఎస్యూఐ (NSUI) జిల్లా అధ్యక్షుడు సందీప్ తాము సిద్ధమని ప్రకటించడంతో వాతావరణం వేడెక్కింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, శిశుమందిర్, డిగ్రీ కాలేజీ మైదానం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు సమాచారం.కాలేజీ ఆస్తులను కాపాడాలని విద్యార్థి సంఘాలు మరియు కాలేజీ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తున్నాయి.ప్రస్తుతం కామారెడ్డి పట్టణమంతా పోలీసుల ఆధీనంలో ఉంది.
