జిల్లాలోని చింతలపాలెం మండలం దొండపాడు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు యువకులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.దొండపాడు గ్రామానికి చెందిన కిరణ్, సాయి అనే ఇద్దరు యువకులు తమ పని మీద వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో యువకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, ట్రాక్టర్ డ్రైవర్పై దర్యాప్తు ప్రారంభించారు.
