హైదరాబాద్లోని మణికొండ చిత్రపురి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ, పార్ట్ టైమ్ యూట్యూబర్గా రాణిస్తున్న కోమలి (21) తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
కోమలికి సాఫ్ట్వేర్ ఉద్యోగి, యూట్యూబర్ అయిన అఖిల్ రెడ్డితో మూడేళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే, వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవల బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అఖిల్ను మర్చిపోలేక కోమలి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. రెండు రోజుల క్రితం అఖిల్కు ఫోన్ చేయగా, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర విచారంలో ఉన్న కోమలి, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
