తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఉదయం 8:15 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మరియు అర్చకులు ఘనస్వాగతం పలికారు.
ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం మంత్రికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకున్న భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు చిత్రపటాన్ని బహూకరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.

