బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, కళాశాల యాజమాన్యం ఘోరంగా విఫలమయ్యాయని పీడీఎస్యూ (PDSU) జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మండిపడ్డారు. నిన్న ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని వసంత ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నిజామాబాద్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రతి ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నా, అందుకు గల వాస్తవ కారణాలను ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ బయటపెట్టడం లేదని నేతలు ధ్వజమెత్తారు.వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాలను మెయిన్ గేట్ వద్దే అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వార్డెన్లు, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థిని వసంత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పీడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు పవన్ కుమార్, సాయి కిరణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
