చందానగర్ డివిజన్ పరిధిలోని కాలనీల్లో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో చేపట్టిన వరద నీటి కాలువల (Storm Water Drain) పనులను మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవి ముగిసేలోపు పనులు పూర్తి చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులను ఆమె హెచ్చరించారు.

అర్జున్రెడ్డి కాలనీ, డిఫెన్స్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీలలో జరుగుతున్న నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని, సాంకేతిక ప్రమాణాల ప్రకారం కాలువలు నిర్మించాలని స్పష్టం చేశారు. నాణ్యత లోపిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే, అంటే వేసవి ముగిసేలోపు పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గడువు విధించారు.గతంలో వర్షాల వల్ల కాలనీలు జలమయమై ప్రజలు పడ్డ ఇబ్బందులను గుర్తు చేస్తూ, ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు వరలక్ష్మి, కాలనీ ప్రతినిధులు మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
