వికారాబాద్ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాహుల్ రాకతో వికారాబాద్ పరిసర ప్రాంతాలు కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడాయి.

“కాంగ్రెస్ కేవలం రాజకీయ పార్టీ కాదు, అదొక సిద్ధాంతం. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి” అని రాహుల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాలని నాయకులను ఆదేశించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవాలని, ప్రజల సమస్యలను వినే అలవాటు చేసుకోవాలని సూచించారు. పార్టీలో విభేదాలకు తావులేకుండా సమిష్టిగా పనిచేయాలని, క్రమశిక్షణ ఉన్న వారికే తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు మంత్రులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి భారీ గజమాలతో రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు.తెలంగాణలో సాధించిన విజయం దేశవ్యాప్త మార్పుకు నాంది అని, ఇదే ఉత్సాహాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని రాహుల్ ఆకాంక్షించారు.
