“రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః”
మియాపూర్, మార్చి 27 (బిఎన్ఎస్ మీడియా):శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మియాపూర్ పరిధిలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ వివిధ ప్రాంతాల్లో జరిగిన కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.
మియాపూర్ సాయిరాం నగర్, ప్రశాంతి నగర్, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, కొండాపూర్ మసీదు బండ ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ… సీతారాముల కళ్యాణం కేవలం ఒక వివాహ వేడుక మాత్రమే కాదని, అది విశ్వాసం, గౌరవం మరియు ధర్మబద్ధమైన అనురాగానికి నిదర్శనమని తెలిపారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడై నిలవాలనే ఆదర్శాన్ని ఈ దివ్య కల్యాణం ప్రపంచానికి తెలియజేస్తుందని అన్నారు.
శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపమైతే, సీతమ్మ క్షమాగుణానికి ప్రతీక అని పేర్కొన్నారు. వీరిద్దరి కలయిక ధర్మం మరియు శాంతి యొక్క సమ్మేళనం అని తెలిపారు. అందువల్ల సీతారాముల కళ్యాణం జరిగే ప్రతి చోట సుభిక్షం, శాంతి నెలకొంటాయని ప్రజల విశ్వాసమని వివరించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్నారు.
