నిజామాబాద్ (బీఎన్ఎస్) మాజీ మంత్రి జీవన్ రెడ్డి బాటలోనే నిజామాబాద్ కాంగ్రెస్ నేత రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం ఆ పార్టీలో కలకలం రేపుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని ఇతర పార్టీలో ఉన్న ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో లేదనీ ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. నిజామాబాద్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే డిఎస్ ప్రచారం ఉండగా ఆయన తనయుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై అలకబోని పార్టీకి గుడ్ బై చెబుతున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆయనకు పదవి దక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ కనుచూపుమేరలో కనబడటం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మపురి సంజయ్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంచి పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో డీఎస్ వారసుడిగా కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క అనుభవాన్ని ఉపయోగించుకుంటుందని కూడా సీఎం తెలిపారు. ధర్మపురి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఆయనకి త్వరలోనే మంచి పదవి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకి ఎటువంటి పదవి దక్కకపోవడం గమనార్హం.
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ధర్మపురి సంజయ్ కు పదవి ఇవ్వాలని హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి ధర్నా నిర్వహించిన విషయం కూడా విధితమే. ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి వస్తుందని అందరూ భావించినప్పటికీ ఆ పదవి కోసం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ప్రచారంతో ఆయనకు పదవి రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నమేనని ఆయన అనుచరులు అంటున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారన్న ప్రచారం జోరు అందుకుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబితే ఏ పార్టీలో చేరుతారని ప్రచారం కూడా జరుగుతుంది. ధర్మపురి సంజయ్ తన తండ్రి డిఎస్ కు మంచి మిత్రుడైన జీవన్ రెడ్డితో కలిసి ఆయన బాటలో నడుస్తారా లేక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా అనేది వేచి చూడాలి.
