హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సంచలనాత్మక పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు, మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అరుణ్ అలియాస్ నానికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
2019లో జరిగిన ఈ ఘటనలో, నిందితుడు 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కోర్టు విచారణలో సమర్పించిన పక్కా సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ, 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.8,000 జరిమానా విధించింది. అదేవిధంగా బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.ఈ కేసు దర్యాప్తులో పోలీసుల శాస్త్రీయ ఆధారాలు, ప్రాసిక్యూషన్ వాదనలు కీలక పాత్ర పోషించాయి. మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారు చట్టం నుండి తప్పించుకోలేరని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.
