కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 140 కేంద్రాల్లో అధికారులు లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి (LDF) వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి (UDF) భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి (UDF) ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సగానికి పైగా మార్కును దాటేసింది. గత ఎన్నికల్లో 98 స్థానాలు గెలుచుకున్న అధికార LDF కూటమి, ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కేవలం 40 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదమ్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయనతో పాటు 21 మంది మంత్రుల్లో 15 మంది తమ తమ స్థానాల్లో వెనుకబడి ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
