టీవీకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెన్నైలోని పనయ్యూర్ పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి పార్టీ అధినేత విజయ్, జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జునతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిశాక విజయ్ తన నివాసానికి వెళ్లిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే మొత్తం 234 స్థానాలకు గాను 108 సీట్లను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మెజారిటీ మార్కుకు మరో 10 సీట్ల దూరంలో నిలిచింది.
కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఐ (ఎం), ఐయూఎంఎల్ పార్టీలు డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ)లో భాగస్వాములుగా ఉన్నాయి. ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు స్థానాలను గెలుచుకోగా, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఐ (ఎం) వీసీకేలు రెండేసి స్థానాలను దక్కించుకున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంటే, విజయ్ నేతృత్వంలోని పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కును సునాయాసంగా దాటుతుంది.
