పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా పెరుగుతున్న దిగుమతి బిల్లుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఇతర పొదుపు చర్యలతో పాటు, బంగారం కొనుగోళ్లపై నియంత్రణలు విధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన కొద్ది రోజులకే, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా, మే 13 నుండి అమల్లోకి వచ్చేలా బంగారం వెండిపై సామాజిక సంక్షేమ సర్చార్జ్ (SWS), వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC)లను పెంచింది. ఈ సుంకాల పెంపుతో బంగారంపై మొత్తం కస్టమ్స్ సుంకం 15 శాతానికి పెరుగుతుంది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు వినియోగదారుగా ఉన్న భారత్, దేశీయ అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇప్పటికే బంగారం, వెండి ధరలు అధికంగా ఉన్న తరుణంలో ఈ సుంకం పెంపుతో వినియోగం మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, పన్నుల పెంపు వల్ల స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
