చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో మరణించాడు. ఆయన ఆకస్మిక మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దిలీప్ రాజ్కు తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పునీత్ రాజ్కుమార్తో కలిసి నటించిన ‘మిలనా’ (2007) చిత్రంతో దిలీప్ రాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా ప్రజలను ఆకట్టుకున్నారు.
దిలీప్ రాజ్ తొలుత రంగస్థలంపై తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రముఖ థియేటర్ గ్రూపులతో కలిసి పనిచేశారు. నటుడిగానే కాకుండా తన డీఆర్ క్రియేషన్స్ పతాకంపై కొన్ని టీవీ సీరియళ్లను కూడా నిర్మించారు. తన కెరీర్లో 24కు పైగా చిత్రాల్లో నటించిన దిలీప్, సినిమా, టీవీ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ రంగస్థలాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.
