హైదరాబాద్: 180 ఏళ్లుగా కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. బత్తిని కుటుంబం అందించే ఈ చేప ప్రసాదం కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది తరలివస్తుంటారు. 1845 నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో ఈసారి కీలక మార్పు చోటుచేసుకుంది.
దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మృగశిర కార్తి ముహూర్తం రాత్రి వేళకు వచ్చింది. జూన్ 8న రాత్రి 9 గంటలకు ముహూర్తం ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి భద్రతా చర్యలను రెట్టింపు చేశారు.
పంపిణీ కోసం 35 కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1.40 లక్షల కొరమీను పిల్లలను సిద్ధం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
జూన్ 8 రాత్రి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. 24 గంటల పాటు నిరంతరంగా ఈ పంపిణీ కొనసాగనుంది.

