బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్లో దాడులకు కుట్ర పన్నినందుకు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ చేతిలో అరెస్టయిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ తన రూపురేఖలను మార్చుకునేందుకు గురుగ్రామ్లో కాస్మెటిక్ చికిత్సలు చేయించుకున్నాడు. ‘రాజా’, ‘కశ్మీరీ’ అనే మారుపేర్లతో ఉన్న షబ్బీర్ను సెంట్రల్ ఏజెన్సీల సమన్వయంతో స్పెషల్ సెల్ ఎన్డీఆర్ (NDR) విభాగం ఢిల్లీ సరిహద్దులో అరెస్టు చేసింది.
జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ జిల్లా కంగన్ ప్రాంతానికి చెందిన ఇతడు బంగ్లాదేశ్ నుంచి భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను నడుపుతున్నాడనే అనుమానంతో భద్రతా సంస్థల నిఘాలో ఉన్నాడు. ఢిల్లీ, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా సంస్థలు ఛేదించిన కొద్ది రోజులకే ఇతని అరెస్టు జరిగింది. ఈ నెట్వర్క్ ఢిల్లీ, కోల్కతాలోని పలు ప్రాంతాల్లో భారత్కు వ్యతిరేకంగా పోస్టర్లను అంటించడంలో భాగమైందని దర్యాప్తు అధికారులు తెలిపారు.
స్పెషల్ సెల్ వర్గాల సమాచారం ప్రకారం, షబ్బీర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం గురుగ్రామ్లోని ఓ వైద్యుడిని సంప్రదించాడు. ఈ చికిత్స కోసం దాదాపు రూ. 1.5 లక్షలు ఖర్చు చేశాడు. అతను తన రూపు రేఖల గురించి చాలా స్పృహతో ఉన్నాడని, అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఎవరికీ గుర్తుపట్టకుండా తన రూపాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
తన దంతాలను మెరుగుపరుచుకోవడానికి గురుగ్రామ్కు చెందిన ఓ డెంటిస్ట్ను కూడా అతను సంప్రదించాడు. లష్కరే తోయిబాతో ముడిపడి ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలు, నెట్వర్క్లను సమన్వయం చేసే సమయంలో భద్రతా బలగాలకు చిక్కకుండా ఉండేందుకే ఇలా కాస్మెటిక్ చికిత్సల ద్వారా తన రూపాన్ని మార్చుకునే ప్రయత్నం చేశాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
షబ్బీర్ లోన్ తీవ్రవాది హాఫిజ్ సయీద్తో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడని అధికారులు తెలిపారు. అతను పాకిస్థాన్లో ఉగ్రవాద శిక్షణ పొందాడని, 2005లో ఫిదాయీన్ దాడి చేసేందుకు ఢిల్లీకి వచ్చినప్పుడు పట్టుబడ్డాడని సమాచారం. జైలు నుంచి విడుదలైన తర్వాత షబ్బీర్ బంగ్లాదేశ్ పారిపోయాడని, అక్కడి నుంచి లష్కరే నెట్వర్క్లను పునరుద్ధరించి ఢిల్లీతో పాటు అనేక ఇతర రాష్ట్రాల్లో ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డాడని భావిస్తున్నారు.
స్పెషల్ సెల్ గతంలో ఇలాంటి ఒక నెట్వర్క్ను ఛేదించి, ఈ ఆపరేషన్తో సంబంధం ఉన్న పలువురు బంగ్లాదేశ్ యువకులను అరెస్టు చేసింది. ఈ కాస్మెటిక్ చికిత్సలకు సంబంధించిన విషయాలపై ఢిల్లీ పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

