సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ). ఇన్స్టాగ్రామ్లో 9 మిలియన్ల ఫాలోవర్లను దాటింది. 2014 నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో సహా, భారతదేశంలోని చాలా ప్రధాన రాజకీయ పార్టీల కంటే ఇది ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉంది. మే 21 నాటికి, బిజెపి అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ @bjp4indiaకు సుమారు 9.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ @incindiaకు దాదాపు 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాండిల్ @aamaadmipartyకు సుమారు 1.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ఈ ఉద్యమం మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యల నుంచి పుట్టింది. ఒక విచారణ సందర్భంగా ఆయన, అర్హత లేని లేదా నిరుద్యోగ యువత కొన్ని వృత్తులలోకి ప్రవేశించడాన్ని ప్రస్తావిస్తూ వారిని ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ అని పోల్చారు. తన వ్యాఖ్యలు కేవలం నకిలీ డిగ్రీలు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయని, యువతను ఉద్దేశించినవి కావని ఆయన తర్వాత స్పష్టత ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా స్పందిస్తూ, గతంలో ఆప్ సోషల్ మీడియా వ్యూహకర్తగా పనిచేసిన 30 ఏళ్ల అభిజీత్ డిప్కే, మే 16న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ప్రారంభించారు. నిరుద్యోగం, విద్య, వైద్యం, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపై ఐదు సూత్రాల నకిలీ మేనిఫెస్టోతో ఈ బృందం యువతను ఆకట్టుకుంది.
దేశంలో 17 శాతంగా ఉన్న నిరుద్యోగం, ఇతర వ్యవస్థాగత సమస్యలపై తమ నిరసనను వ్యక్తం చేయడానికి జనరేషన్-జెడ్ కి ఇదొక సృజనాత్మక మార్గమని కొందరు సమర్థిస్తున్నారు. ఈ ఉద్యమం వెనుక రాజకీయ కోణం ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీని వ్యవస్థాపకుడు అభిజీత్కు గతంలో సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ వంటి ఆప్ నేతలతో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ బృందం అధికారికంగా రాజకీయ పార్టీగా నమోదు కాలేదు. ఇది కేవలం మీమ్స్ ద్వారా నిరసన తెలియజేసే ఒక డిజిటల్ వేదికగానే కొనసాగుతోంది.
A post shared by Cockroach Janta Party (@cockroachjantaparty)

