ట్విషా మృతిలో వెలుగుచూసిన మానసిక వేధింపులు

May 22, 2026 1:12 PM

ట్విషా శర్మ మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కట్న వేధింపులు, మానసిక హింస ఆరోపణలతో పాటు పట్టణ కుటుంబాల్లో మహిళలు ఎదుర్కొనే ఒత్తిళ్లు, “సర్దుకుపోవాలి” అనే అంచనాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ట్విషా అత్త, రిటైర్డ్‌ జడ్జి గిరిబాలా సింగ్‌ ఆరోపణలను ఖండించారు. ట్విషా మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం గురించి పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా బయటకు వచ్చిన ఆడియో రికార్డుల్లో ట్విషా గత సంబంధాలపై ప్రశ్నలు అడిగినట్లు వినిపిస్తోందని మీడియాలో చర్చ సాగుతోంది. ఆమెకు ఇతర పురుషులతో సంబంధాలు ఉన్నాయా?, పెళ్లి తర్వాత కూడా అవి కొనసాగుతాయా?, ఆ సంబంధాలకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా? వంటి ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆడియోలు ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా ఉన్నాయి.

గిరిబాలా సింగ్‌ మీడియా ఇంటర్వ్యూల్లో ట్విషా గర్భధారణపై ఆందోళన చెందేదని, మానసిక సమస్యలు ఉన్నాయని, ‘మరిజువానా’ వినియోగంపై కూడా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆమె భోపాల్‌ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ట్విషా మృతి కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆమెపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది.

మహిళల హక్కుల న్యాయవాది ఆడ్రే డి’మెల్లో ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఆమె సహాయం కోరుతూ అరుస్తూనే ఉంది. కానీ వచ్చిన స్పందన బాధాకరం. ఇలాంటి పరిస్థితి నుంచి ఆమెను బయటకు తీసుకురావడంలో కుటుంబం మరింత వేగంగా స్పందించాల్సింది. చాలా కుటుంబాల్లో మహిళలకు ‘సర్దుకుపో’ అని చెప్పడం వల్ల వారికి ఎవరూ అండగా లేరనే భావన ఏర్పడుతుంది. అధికార సంబంధాల మధ్యే హింస పెరుగుతుంది” అని చెప్పారు.

గిరిబాలా సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కలవరపరిచాయని డి’మెల్లో అన్నారు. “ఆమె చెప్పిన ప్రతిదీ నిజమే అనుకున్నా.. మీ ఇంట్లో ఎవరో ఇంతగా బాధపడుతుంటే మీరు ఎలా స్పందించాలి అన్నదే అసలు ప్రశ్న. ఆ వ్యాఖ్యలు చాలా సమస్యాత్మకం” అని చెప్పారు.

చట్టపరంగా మానసిక హింస కూడా క్రూరత్వంలో భాగమేనని ఆమె గుర్తు చేశారు. “గృహ హింస చట్టం భావోద్వేగ, మానసిక, శారీరక హింసలను గుర్తించింది. అయినా ఇప్పటికీ చాలా మంది కంటికి కనిపించే గాయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ కూడా గృహ హింస ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థం చేసుకునే స్థాయికి ఇంకా చేరలేదు. హింస ఎప్పుడూ శారీరక గుర్తులు వదిలిపెట్టదు. అందుకే చాలా కేసులు నిరూపించలేకపోతున్నారు” అని తెలిపారు.

మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో హింస గురించి బయట మాట్లాడటానికి పెద్ద అవమాన భావన ఉంటుందని డి’మెల్లో చెప్పారు. “గౌరవం, సామాజిక ప్రతిష్ఠ పేరుతో ఇంట్లో జరిగేదంతా దాచేస్తారు. అదే దుర్వినియోగానికి అవకాశం ఇస్తుంది. కొంతమంది తక్కువ ఆదాయ వర్గాల్లో మాత్రం పరిస్థితులపై బహిరంగంగా మాట్లాడే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది” అని అన్నారు.

న్యాయ నిపుణుల ప్రకారం.. మహిళల వ్యక్తిత్వం, రూపం, పనితనం, ఇంటి పనులపై నిరంతర అవమానకర వ్యాఖ్యలతో ప్రారంభమయ్యే హింస క్రమంగా తీవ్రమైన మానసిక నియంత్రణగా మారుతుంది.

మహిళల హక్కుల న్యాయవాది ఫ్లావియా అగ్నెస్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. “చాలా మహిళలు నిశ్శబ్దంగా బాధపడుతూనే ఉంటారు. చివరకు మరణమే మార్గమని భావించే పరిస్థితి వస్తుంది. ఇది ఎప్పుడూ కట్న సమస్యే కావాల్సిన అవసరం లేదు. భావోద్వేగ, మానసిక హింసపై ఇంకా సరైన చర్చ జరగడం లేదు” అని చెప్పారు.

“మానసిక హింస ఒక్కటే మహిళ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీయగలదు. వంట, రూపం, బరువు, వ్యక్తిత్వంపై వచ్చే వ్యాఖ్యల రూపంలో అది కనిపిస్తుంది. ఆర్థికంగా పూర్తిగా ఆధారపడేలా చేయడం కూడా హింసే. ఉన్నత వర్గ కుటుంబాల్లో కోర్టును ఆశ్రయించడం ఇప్పటికీ అవమానంగా భావిస్తారు” అని అగ్నెస్‌ తెలిపారు.

సైకాలజిస్ట్‌ డాక్టర్‌ ఇటిషా నగర్‌ ప్రకారం.. ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో భావోద్వేగ హింసను “శ్రద్ధ” పేరుతో దాచిపెడతారు. “తక్కువ చేసి మాట్లాడటం, పట్టించుకోకపోవడం, ఎద్దేవా వ్యాఖ్యలు, అవమానపరచడం వల్ల వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. బయటకు మాత్రం సున్నితంగా మాట్లాడినట్లు కనిపిస్తుంది. అందుకే ఈ హింసను గుర్తించడం కష్టం అవుతుంది” అని చెప్పారు.

“డబ్బు, చదువు, సామాజిక గౌరవం ఉన్నంత మాత్రాన సానుభూతి ఉంటుందనే గ్యారంటీ లేదు. చాలా కుటుంబాలు అదే నియంత్రణను మరింత మెరుగైన రూపంలో కొనసాగిస్తున్నాయి” అని ఆమె వ్యాఖ్యానించారు.

మహిళా హక్కుల కార్యకర్త ఖదీజా ఫారూఖీ మాట్లాడుతూ.. పట్టణ ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో హింస ఫలితాలు మాత్రమే బయటకు కనిపిస్తాయని చెప్పారు. “మహిళలు ఎప్పుడూ సరిపోరనే భావన కలిగించేలా మాట్లాడటం, పరిమితులు విధించడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఇక్కడ శారీరక హింస కంటే మానసిక, భావోద్వేగ హింస ఎక్కువగా ఉంటుంది” అని అన్నారు.

చివరగా ఆమె మాట్లాడుతూ.. “సామాజిక వ్యవస్థతో పాటు న్యాయవ్యవస్థలో కూడా మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోంది” అని పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media