హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్తున్నారా? అయితే పార్కింగ్ ఛార్జీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రస్తుతం Rajiv Gandhi International Airport (RGIA)లో పార్కింగ్ ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి. కార్ పార్కింగ్కు మొదటి 30 నిమిషాలకే ₹150 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా ₹100 చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. ఇక కమర్షియల్ టాక్సీల పరిస్థితి మరింత కఠినంగా ఉంది. మొదటి అరగంటకే ₹300 వరకు వసూలు చేస్తున్నారు.
దీంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల విమానాశ్రయాల కంటే కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ మొదలైంది. విమానాశ్రయ నిర్వహణ సంస్థ అయిన GHIAL మాత్రం మెరుగైన సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసమే ఈ రుసుములు పెంచినట్లు చెబుతోంది. అయితే ప్రయాణికులు మాత్రం “సొంత వాహనం తీసుకెళ్లడమే శిక్షలా మారింది” అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక క్యాబ్ డ్రైవర్ల ఆవేదన మరింత తీవ్రంగా ఉంది. ప్రయాణికుల కోసం వేచి ఉండాలన్నా, పికప్ చేయాలన్నా భారీ పార్కింగ్ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. రోజుకు పలుమార్లు ఎయిర్పోర్ట్కు వెళ్లే డ్రైవర్లకు ఇవి పెద్ద భారం అవుతున్నాయి. చివరికి ఈ అదనపు ఖర్చు మొత్తం ప్రయాణికులపైనే పడే అవకాశం ఉందని కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

