బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలపై ఓ గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంకటేష్ డీ అనే టెక్కీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోలో నగర ట్రాఫిక్ పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు.
తన ఇంటి నుంచి కార్యాలయం కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. రెండు చక్రాల వాహనంపై వెళ్లేందుకు 45 నిమిషాలు పట్టిందని చెప్పారు. సాధారణంగా ఇదే ప్రయాణం 10 నిమిషాల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు.
“ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయల్దేరాను. ఆఫీసుకు చేరేసరికి 10.45 అయింది. నాలుగు కిలోమీటర్ల దూరం రావడానికి 45 నిమిషాలు పట్టింది” అని వీడియోలో వెంకటేష్ చెప్పారు.
అధిక పన్నులు చెల్లిస్తున్నప్పటికీ నగర మౌలిక సదుపాయాలు మాత్రం దారుణంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “మన పన్నుల డబ్బు ఎక్కడికి వెళ్తోంది? కొన్ని నెలల్లో జీతం కన్నా ఎక్కువ పన్నులు చెల్లించాను. నాకే కాదు.. వేలాది మంది ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కానీ ఇలాంటి ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం చాలా విసుగుగా ఉంది” అని అన్నారు.
బెంగళూరులో ఐటీ రంగం వేగంగా విస్తరించడం, నగర జనాభా పెరగడం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. ప్రస్తుతం నగరంలో 1.3 కోట్లకు పైగా జనాభా ఉంది. లక్షల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో రద్దీ పెరిగింది. ఇరుకైన రహదారులు, సరిపోని ప్రజా రవాణా వ్యవస్థ, కొనసాగుతున్న మౌలిక వసతుల పనులు సమస్యను మరింత పెంచుతున్నాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా తమ ఇబ్బందులను పంచుకున్నారు. “ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా సరైన సదుపాయాలు లేకపోవడం బాధాకరం” అని ఓ యూజర్ వ్యాఖ్యానించగా.. “ప్రయాణ సమయాన్ని కలిపితే ప్రతిరోజూ అదనపు పని చేస్తున్నట్టే” అని మరో వ్యక్తి రాశారు.
రద్దీ సమయాల్లో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి రావడం వల్ల ఉద్యోగుల ఉత్పాదకతతో పాటు జీవన ప్రమాణాలపై కూడా ప్రభావం పడుతోంది. మెట్రో విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ యాప్లు వంటి చర్యలు తీసుకుంటున్నా.. పట్టణ ప్రణాళిక లోపాలు, అధిక వాహనాల సంఖ్య వల్ల సమస్య కొనసాగుతోంది.

