భోపాల్లోని తన అత్తింటి వద్ద 12 రోజుల క్రితం ఉరివేసుకుని కనిపించిన మాజీ మోడల్, నటి ట్విషా శర్మ (33) అంత్యక్రియలు ఆదివారం భద్భదా విశ్రామ్ ఘాట్లో ముగిశాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) వైద్యుల బృందం ఆమె మృతదేహానికి రెండవసారి పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మే 12న ట్విషా శర్మ భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన అత్తింట్లో ఉరివేసుకుని చనిపోయింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, వరకట్న వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భోపాల్లో జరిగిన మొదటి పోస్ట్మార్టం రిపోర్టుపై ట్విషా తండ్రి నవనిధి శర్మ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె మెడపై, చేతులపై ఉన్న గాయాలను సరిగ్గా పరిశీలించలేదని ఆరోపిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందంతో మళ్లీ పోస్ట్మార్టం చేయాలని ఆదేశించింది. శర్మ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పదిరోజుల పాటు పరారీలో ఉన్న ఆమె భర్త (లాయర్) సమర్థ్ సింగ్ను జబల్పూర్లో అరెస్టు చేశారు. కోర్టు అతనికి ఏడు రోజుల పోలీసు రిమాండ్ విధించింది. ఈ కేసులో ట్విషా అత్తగారు, మాజీ జిల్లా జడ్జి అయిన గిరిబాల సింగ్ పై కూడా వరకట్న వేధింపుల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.

