ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా మెయిన్పాట్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక మహిళ తన 90 ఏళ్ల అత్తకు పెన్షన్ డబ్బులు ఇప్పించడం కోసం ఆమెను తన వీపుపై మోసుకుంటూ మండుటెండలో అడవి మార్గాలు, రాళ్లు, వాగులు దాటుకుంటూ దాదాపు 9 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వెళ్ళింది.
సుఖ్మానియా బాయి ఉన్న ఊరు సరైన రవాణా సౌకర్యాలు లేని అటవీ ప్రాంతం కావడంతో బ్యాంకుకు చేరుకోవడానికి వారు కాలినడకన కఠినమైన మార్గాల గుండా ప్రయాణించాల్సి వస్తోంది. పెన్షన్ డబ్బులు విడుదల కావాలంటే లబ్ధిదారులు బ్యాంకులో వేలిముద్ర లేదా గుర్తింపు ధృవీకరణ కోసం వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అందుకే సుఖ్మానియా బాయి గత కొన్ని నెలలుగా తన అత్తను ఇలాగే వీపుపై మోసుకుంటూ బ్యాంకుకు తీసుకెళ్తోందని స్థానికులు చెప్పారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి వీడియో తీస్తూ ఆ మహిళను ప్రశ్నలు అడగడం వినిపిస్తుంది. వృద్ధురాలిని నేరుగా బ్యాంకుకు తీసుకొస్తేనే పెన్షన్ డబ్బులు ఇస్తారని, తమకు నెలకు రూ. 1,500 పెన్షన్ వస్తుందని ఆ మహిళ అతనికి సమాధానం ఇచ్చింది. గతంలో పెన్షన్ డబ్బులు స్థానికంగానే లేదా సులభంగానే అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం వల్లే ఇలా మోసుకుని వెళ్లాల్సి వస్తోందని ఆమె తెలిపింది.
ఈ వీడియో ఆన్లైన్లో తీవ్ర చర్చకు దారితీసింది. డిజిటల్ ఇండియా, డోర్స్టెప్ బ్యాంకింగ్ అని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ మారుమూల ప్రాంతాల్లోని వృద్ధులు, మంచానికే పరిమితమైన పెన్షనర్లు ధృవీకరణ కోసం ఇంకా ఇంత దూరం ఎందుకు ప్రయాణించాల్సి వస్తోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

