7 వేల కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ.. హైదరాబాద్లో మహిళకు కొత్త జీవితం
చైనాలో ఉన్న వైద్యుడు.. హైదరాబాద్లో రోబోట్తో ఆపరేషన్
90 నిమిషాల్లో క్లిష్ట యూరాలజీ శస్త్రచికిత్స పూర్తి
హైదరాబాద్: వైద్య రంగంలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. చైనాలో ఉన్న వైద్యుడు.. హైదరాబాద్లోని రోగికి రోబోటిక్ విధానంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. దాదాపు 7 వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ ఆపరేషన్ నిర్వహించడం వైద్య చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.
హైదరాబాద్లోని AINU Hospitalsలో 63 ఏళ్ల మహిళకు అత్యవసర యూరాలజీ సర్జరీ అవసరమైంది. అయితే శస్త్రచికిత్స చేయాల్సిన డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ అప్పటికే చైనాలోని Wuhan నగరంలో ఓ వైద్య సదస్సుకు వెళ్లారు.
అయినా 5జీ నెట్వర్క్, ఆధునిక రోబోటిక్ టెక్నాలజీ సాయంతో వైద్య బృందం ఆపరేషన్ పూర్తి చేసింది. చైనాలో నుంచే డాక్టర్ గౌస్ రోబోటిక్ కంట్రోల్ వ్యవస్థను నిర్వహించారు. ఆయన చేతుల కదలికలను కేవలం 200 మిల్లీ సెకన్ల వేగంతో హైదరాబాద్లోని రోబోటిక్ హ్యాండ్స్ అనుసరించాయి. మొత్తం శస్త్రచికిత్సను 90 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశారు.
వైద్య రంగంలో కొత్త దిశ
దూరం చికిత్సకు అడ్డంకి కాదని ఈ ‘రిమోట్ సర్జరీ’ మరోసారి నిరూపించింది. టెక్నాలజీ, వైద్య రంగం కలిస్తే అసాధ్యం అనేది లేదని వైద్యులు చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ ఉన్న రోగికైనా.. మరో దేశంలో ఉన్న నిపుణుల నుంచి చికిత్స అందించే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.

