ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తాను చేసిన వ్యాఖ్యల వివాదంపై నమోదైన కేసుల విషయంలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను అరెస్ట్కు సిద్ధంగా ఉన్నానని, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించబోనన్నారు. తన జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయని, జైలు జీవితం అనే అనుభవం మాత్రమే మిగిలి ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. విద్యార్థి ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, చట్టసభలు, మీడియాలో పనిచేసిన అనుభవాలు ఉన్నాయని, జైలు జీవితం అనుభవం లేదన్నారు. ఒకవేళ అది కూడా వస్తే, ఆత్మకథ రాసుకోవడానికి అదొక పరిపూర్ణమైన అధ్యాయం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
“నాపై కేసు నమోదు చేశారు. ఆ మరుసటి రోజే నన్ను అరెస్ట్ చేస్తారని నాకు సమాచారం అందింది. నేను ఎక్కడికీ వెళ్లను, ఇంట్లోనే ఉంటాను, అరెస్ట్ చేసుకోండి. ఇప్పటివరకు నేను ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదు, వేయను కూడా. కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ కూడా ఇంకా వేయలేదు. నేను అరెస్ట్కు సిద్ధం” అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో జనసేన కార్యకర్తలు, నాయకులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి.

