కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. 15 ఏళ్లుగా బీజేపీ సవాళ్లను ఎదుర్కొంటూ అజేయ శక్తిగా కనిపించిన పార్టీ ఇప్పుడు అసంతృప్తి, వర్గపోరుతో సతమతమవుతోంది.
మమత వ్యూహంపై ప్రశ్నలు
సీనియర్ నేత కాకోలి ఘోష్ దస్తిదార్ రాజీనామా లేఖ ఈ అసంతృప్తికి కేంద్రబిందువైంది. పార్టీని మునుపటి తరహాలో నడపాలని ఆమె మమతా బెనర్జీకి సూచించారు. ఎన్నికల వ్యూహ సంస్థ ఐ-ప్యాక్ ప్రభావంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, పార్టీ అసలు సిద్ధాంతాల నుంచి దూరమైందన్న వ్యాఖ్యలు నేతల్లో చర్చకు దారితీశాయి.
ఇదే సమయంలో పార్టీ అధికార ప్రతినిధి రిజు దత్తాను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేశారు. బహిరంగ విమర్శలు చేసే నేతలపై చర్యల కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు ముగ్గురు కౌన్సిలర్లు కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆయనను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. కొందరు టీఎంసీ నేతలు పార్టీ మారే అవకాశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు గడిచినా మమతా బెనర్జీ ఇంకా ఓటమిని పూర్తిగా అంగీకరించలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీ ప్రజలతో సంబంధాలు కోల్పోయిందని, నాయకత్వం అందుబాటులో లేకుండా పోయిందని పలువురు నేతలు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

