హైదరాబాద్: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఆయనను రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
విచారణలో భాగంగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. అయితే, విచారణ సందర్భంగా బండి భగీరథ్ అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.
కస్టడీ చివరి రోజు కావడంతో కేసుకు సంబంధించిన కీలక అంశాలపై పోలీసులు నేడు మరింతగా ప్రశ్నించే అవకాశం ఉంది. అందిన ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసిన పోలీసులు అదే ప్రకారం విచారణ కొనసాగిస్తున్నారు.
పోలీస్ కస్టడీ గడువు నేటితో ముగియనున్నందున సాయంత్రం ఆయనను తిరిగి చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.

