చంగ్రాబాంధా, కూచ్బెహార్: పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేస్తున్నారు. ఉత్తర బెంగాల్లో గతంలో పశువుల అక్రమ రవాణా, చొరబాట్లకు గురైన గ్రామాల్లో ఇప్పుడు కొంత ఊరట కనిపిస్తోంది.
సరిహద్దు కంచె నిర్మాణం వేగం పెరగడంతో పాటు బీఎస్ఎఫ్కు భూముల అప్పగింత కూడా కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ సరిహద్దు జిల్లాల్లో 142.79 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ చర్యలను ప్రశంసిస్తూ, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతపై ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. అక్రమ చొరబాటుదారులపై ‘గుర్తింపు, జాబితా నుంచి తొలగింపు, దేశం నుంచి పంపివేత’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే సరిహద్దు గ్రామాల ప్రజలు మాత్రం భద్రతతో పాటు భూ పరిహారం, భూముల కొలతలు, తమ పొలాలకు చేరుకునే అవకాశాలపై స్పష్టత కోరుతున్నారు. శాశ్వత కంచె నిర్మాణం పూర్తైతే మరింత భద్రత లభిస్తుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బీఎస్ఎఫ్ గస్తీ, సీసీ కెమెరాలు, అధునాతన లైటింగ్ వ్యవస్థల వల్ల పరిస్థితులు ఇప్పటికే మెరుగయ్యాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని వారు పేర్కొంటున్నారు.

