న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో దేశీయ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (AIMTC) ప్రధాని నరేంద్ర మోదీని కోరింది.
డీజిల్ ఖర్చు వాణిజ్య వాహనాల నిర్వహణ వ్యయంలో దాదాపు 60 శాతం ఉంటుందని AIMTC జాతీయ అధ్యక్షుడు హరీష్ సభర్వాల్ తెలిపారు. అధిక డీజిల్ ధరల వల్ల ట్రక్ ఆపరేటర్లు, చిన్న ఫ్లీట్ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. మే 2026లో బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు 20 శాతం తగ్గినా, ఆ ప్రయోజనం దేశీయ డీజిల్ ధరల్లో కనిపించలేదని అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్న రోడ్డు రవాణా రంగానికి ఉపశమనం కల్పించేందుకు తక్కువ ముడి చమురు ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు, రవాణా రంగానికి అందించాలని AIMTC కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది.

