రోజుకు 90 వేల మందికి పైగా దర్శనం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజుకు సుమారు 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 16 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూలో ప్రవేశించిన భక్తులకు దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. నిన్న 83,382 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 34,083 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు నమోదైంది. లడ్డూ ప్రసాదం 3.97 లక్షలు విక్రయించారు. అన్నప్రసాదం 2.13 లక్షల మంది భక్తులు స్వీకరించారు. తిరుమలకు రోజూ దాదాపు 15 వేల వాహనాలు చేరుతుండగా, పార్కింగ్ సామర్థ్యం 6,800 వాహనాలకు మాత్రమే ఉంది. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు తిరుపతి నుంచి తిరుమలకు 100 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని టీటీడీ యోచిస్తోంది. కాలుష్యం ఎక్కువగా వెదజల్లే వాహనాలపై కూడా ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తోంది.

