నైరోబీలో మహిళల ఆందోళన
నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలో వందలాది మహిళలు ర్యాలీ నిర్వహించి మహిళల హత్యలు, వారిపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శవపేటికను మోస్తూ “మహిళల హత్యలు ఆపండి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇటీవల ఓ గాయని సజీవదహనం ఘటనతో పాటు చిన్నారుల అదృశ్యాలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న రూబీ అబురా, తన ప్రియుడు తనపై దాడి చేశాడని, తన తల్లిని హత్య చేశాడని చెప్పారు.
లింగ ఆధారిత హింస కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కెన్యా మహిళా న్యాయవాదుల సమాఖ్య ప్రకారం, నైరోబీ, మొంబాసా, కిసుము నగరాల్లో వారానికి సుమారు 70 లింగ ఆధారిత హింస కేసులు నమోదవుతున్నాయి. మహిళల హింసను జాతీయ సంక్షోభంగా ప్రకటించాలని పలు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

