హైదరాబాద్: భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు మరో రెండు నుంచి మూడు రోజుల్లో కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ 1 ప్రాంతంలో రుతుపవనాల ప్రవేశం మొదలవుతుంది.
ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఎల్నినో వైపు మారుతున్నాయని, జూన్లో బలహీనంగా ఉండే ఎల్నినో సెప్టెంబరుకు మధ్యస్థం నుంచి బలమైన స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది.
అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు కూడా అదే సమయంలో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.
మొదట మే 26న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసినా ఆలస్యమైంది.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
భారత్కు ఈసారి దీర్ఘకాల సగటు (LPA) వర్షపాతంలో 90% మాత్రమే అందే అవకాశముంది.
ఎల్నినో పరిస్థితులు ఏర్పడటం వల్ల వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

