న్యూఢిల్లీ: ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఒక హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో తొమ్మిది మందిని ఇప్పటికే గుర్తించగా, మిగిలిన 12 మంది వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సేవల బృందాలు రాత్రంతా శ్రమించి సహాయక చర్యలను కొనసాగించాయి. హోటల్ శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు, ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని పరిశీలించేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
హోటల్ యజమానిపై FIR
ఈ ప్రమాదంపై ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఘటనపై సమగ్ర మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘనలే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా భావిస్తుండటంతో.. హోటల్ యజమానిపై పోలీసులు FIR నమోదు చేశారు. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం
ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో ఢిల్లీ సీఎంఓ కీలక నిర్ణయం తీసుకుంది. నగరవ్యాప్తంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని, అనుమతులు లేని ఇల్లీగల్ ప్రాపర్టీలు, అనధికార గెస్ట్ హౌస్లపై తక్షణమే క్రాక్డౌన్ (తనిఖీలు) ప్రారంభించాలని ఆదేశించింది. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలను సీజ్ చేయడంతో పాటు, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది.
Also Read



