పింఛను డబ్బు కోసం కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన కేసులో మల్కాజిగిరి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కుమారుడు, కుమార్తెకు ఉరిశిక్ష, సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు విధించింది. హైదరాబాద్ మౌలాలిలోని డాక్టర్ కృష్ణానగర్, రైల్వేకాలనీకి చెందిన మారుతి సుతార్(70) విశ్రాంత రైల్వే ఉద్యోగి. అతనికి భార్య గంగాబాయి, కుమారుడు కిషన్ సుతార్, కుమార్తెలు అనుపమ, ప్రపుల్ల ఉన్నారు. పెద్ద కుమార్తె అనుపమకు వివాహమై పుణెలో ఉంటోంది. కిషన్, ప్రపుల్ల ఇంట్లోనే ఖాళీగా ఉండేవారు. మారుతికి ప్రతి నెలా వస్తున్న 30 వేల పింఛనుతోనే ఇల్లు గడిచేది. మారుతిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు.
2019 ఆగస్టు 16న ఉమ్మెత్త పూలు, కాయలు ఎండబెట్టి పొడి చేసి మారుతి తినే భోజనంలో కలిపి పరీక్షించారు. రెండు రోజులు అలా చేశాక మూడో రోజు మోతాదు పెంచడంతో మారుతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అతడిని కత్తులతో పాశవికంగా నరికి శరీర భాగాలను బకెట్లలో నింపారు. ఎవరూ లేని సమయంలో వాటిని బయట పడేయాలని ప్రయత్నించారు. ఎదురింట్లో శుభకార్యం జరుగుతుండటంతో ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఆగస్టు 18న దుర్వాసన వస్తోందని స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా బకెట్లలో దాచిన శరీర భాగాలు కనిపించాయి. దీంతో నేరం బయటపడింది. చివరికి కోర్టు వీరికి శిక్షలు విధించింది.

