అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్లో జరిగిన విషాద ఘటనలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం జరిగిన ఈ ప్రమాదం కుటుంబ విహారాన్ని విషాదంగా మార్చింది.
మృతుడిని రోమాంచ్ మహాజన్గా పోలీసులు గుర్తించారు. ఆయన తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, మధ్యాహ్నం సుమారు 2:47 గంటల సమయంలో చెర్రీ హిల్, బెథెస్డా ఫౌంటెన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం సెంట్రల్ పార్క్లో అత్యంత రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, కుటుంబ సభ్యులు గుర్రపు బండిలో ప్రయాణిస్తున్న సమయంలో ఫోటోలు తీసేందుకు కొద్దిసేపు ఆగారు. అదే సమయంలో గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పరుగెత్తింది.
దాంతో బండి వేగంగా రోడ్డుపై దూసుకెళ్లి చివరకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోమాంచ్ మహాజన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబ సభ్యుల ఫోటో తీసేందుకు బండి డ్రైవర్ వాహనం నుంచి కొంత దూరం వెళ్లినట్లు గుర్తించారు. గుర్రపు బండిని పర్యవేక్షణ లేకుండా వదిలేయడం భద్రతా నిబంధనలకు విరుద్ధమని అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
ALSO READ



