సుస్మిత వ్యాఖ్యల వివాదంపై చర్చ జరిగిందా?
రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి మంత్రులు దానసరి సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు.
మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్రెడ్డికి బంగారు రాఖీ కట్టారు. పండుగ వాతావరణంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆమె చెప్పారు.
రేవంత్రెడ్డికి తాను మూడోసారి రాఖీ కట్టినట్లు సురేఖ తెలిపారు. తాను అందరికీ సోదరినే అని చెప్పారు. రేవంత్రెడ్డి మనవడు, అల్లుడికి కూడా ఆమె రాఖీ కట్టారు.
సీఎం రేవంత్రెడ్డితో సురేఖ భేటీ
రాఖీ వేడుకల అనంతరం మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు.
ఇటీవల వివాదాస్పదంగా మారిన సుస్మిత వ్యాఖ్యల అంశంపై కూడా సీఎం, సురేఖ మధ్య ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పరకాల ఎపిసోడ్ తర్వాత కొండా సురేఖ తొలిసారిగా సీఎం నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కొన్ని రోజులుగా ఈ అంశంపై మౌనంగా ఉన్న ఆమె.. ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డితో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడతానని సురేఖ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
సుస్మిత వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదం
కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఈ వ్యవహారంలో కుమార్తె వ్యాఖ్యలను సురేఖ ఖండించలేదన్న అంశంపై పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరిగింది.
ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం సాగింది. దీంతో సురేఖ పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి.
భేటీతో వివాదానికి తెరపడుతుందా?
తాజా భేటీతో ఈ వివాదానికి తెరపడుతుందా? లేక రాజకీయంగా మరో మలుపు తిరుగుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.



