జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో రగిలిపోయిన ఓ భర్త, ఆమె గాఢనిద్రలో ఉండగా కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు గ్రామానికి చెందిన మంద రవి, అనూష (35) దంపతులు. అనూష పరకాల మండలం మల్లక్కపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున అనూష పడుకుని ఉండగా, భర్త రవి కత్తితో ఆమె శరీర భాగాలపై దాడి చేయడమే కాకుండా గొంతు కోశాడు. అనూష కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని రవిని అడ్డుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను 108 వాహనంలో హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనూష పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
