హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని హెచ్పీ గ్యాస్ సిలిండర్ లారీ బలితీసుకుంది.మృతుడు శాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామానికి చెందిన కూనూరు రాజు (30) గా గుర్తించారు. రాజు తన బైక్పై వెళ్తుండగా, కమలాపూర్ మండల కేంద్రంలో గ్యాస్ లారీ అదుపుతప్పి అతడిని ఢీకొట్టింది. లారీ టైర్ల కింద పడటంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న సీఐ హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత కోసం పోలీసులు స్థానిక సీసీటీవీ ఫుటేజీని సేకరించి విడుదల చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
