సాగర తీరంలో సినీ తారల క్రికెట్ పండగ అట్టహాసంగా జరిగింది. ఏసీఏ-వీడీసీఏ (ACA-VDCA) స్టేడియం వేదికగా జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) మ్యాచ్లు విశాఖ వాసులను అలరించాయి. తమ అభిమాన హీరోలను మైదానంలో చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో స్టేడియం పరిసరాల్లో కోలాహలం నెలకొంది.

తెలుగు వారియర్స్, భోజ్పురి దబాంగ్ జట్ల మధ్య జరిగిన పోరులో టాలీవుడ్ స్టార్లకు నిరాశే ఎదురైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్ ప్రత్యర్థిని 155 పరుగుల వద్ద కట్టడి చేసినప్పటికీ, బ్యాటింగ్లో తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన భోజ్పురి జట్టు 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది.

అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ 18.1 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. వినయ్, సుధీర్ బాబు మోస్తరు స్కోరుతో రాణించినా, మిగిలిన వారు విఫలమవ్వడంతో తెలుగు జట్టుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో పంజాబ్పై కర్ణాటక బుల్డోజర్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది.ఫలితం ఎలా ఉన్నా, తమ ఫేవరెట్ స్టార్లను స్టేడియంలో చూసిన వైజాగ్ క్రికెట్ అభిమానులు పండగ చేసుకున్నారు.

