రాజకీయ ముసుగులో నేరాలు చేసే ‘పొలిటికల్ రౌడీల’ ఆటలు సాగనివ్వబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు.

కాకినాడ ఏఎమ్ గ్రీన్, కియా, భోగాపురం వంటి ప్రాజెక్టులు టీడీపీ కష్టార్జితమని.. ఏమీ చేయని వైసీపీ ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం పాకులాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు. “గంజాయి, డ్రగ్స్, మైనింగ్లో మాత్రమే వైసీపీకి క్రెడిట్ ఉంది” అని ఎద్దేవా చేశారు. మూడు ముక్కలాట ఆడి మూడు ప్రాంతాల్లోనూ వైసీపీ దెబ్బతిన్నదని, అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను నెంబర్ వన్ సిటీగా, తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. పల్నాడులో హింసను ప్రేరేపిస్తే సహించేది లేదని, సీమలో ముఠాలను అంతం చేసినట్టే పల్నాడులోనూ ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని వదిలిపెట్టమని, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. “నాడు నా ఇంటి గేటుకు కట్టిన తాళ్లే.. నేడు వైసీపీ పాలిట రాజకీయ ఉరితాళ్లు అయ్యాయి” అంటూ గత సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
