ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుమారుడు ప్రణవ్తో కలిసి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కుమారుడు ప్రణవ్ బరువుకు సమానమైన బెల్లాన్ని (నిలువెత్తు బంగారం) అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వం తలపెట్టిన ప్రజాహిత పనులు విజయవంతం కావాలని వనదేవతలను వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. దర్శనం అనంతరం జాతరలో భక్తులకు అందుతున్న రవాణా సౌకర్యాలు మరియు ఇతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు.
