అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల తాసిల్దార్గా విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎల్.వి. ప్రసాద్ (56) ఆకస్మికంగా మృతి చెందారు. తన స్వస్థలమైన నర్సీపట్నంలో ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై ఆయన కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది.

గతంలో నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రసాద్, ఇటీవలే తాసిల్దార్గా పదోన్నతి పొంది కొయ్యూరుకు బదిలీ అయ్యారు. కొద్ది కాలంలోనే సమర్థవంతమైన అధికారిగా ప్రజల మన్ననలు పొందారు. నిజాయితీ, అంకితభావంతో పనిచేసే అధికారిని కోల్పోవడం రెవెన్యూ శాఖకు తీరని లోటు అని సహచర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ మృతి పట్ల జిల్లా కలెక్టర్, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
