చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధులపై ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు. లక్నోలో జరుగుతున్న స్పీకర్ల సదస్సులో “ప్రజల పట్ల శాసనవ్యవస్థ జవాబుదారీతనం” అనే అంశంపై మాట్లాడుతూ, బాధ్యత మరిచిన ఎమ్మెల్యేలపై కఠిన నిబంధనలు తీసుకురావాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగుల మాదిరిగానే, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలకు “పని లేదు – జీతం లేదు” నిబంధనను వర్తింపజేయాలని ప్రతిపాదించారు. సభకు రాకుండానే వేతనాలు, భత్యాలు తీసుకోవడం అనైతికమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభకు రాకుండా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తే, వారిని వెనక్కి పిలిపించే ‘రైట్ టు రీకాల్’ హక్కును ఓటర్లకు కల్పించేలా చట్ట సవరణ చేయాలని కోరారు.
2024 ఎన్నికల తర్వాత ఏపీలో కొందరు సభ్యులు (వైసీపీ నేతలను ఉద్దేశించి) ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సభకు రాలేదని, ఇది వ్యవస్థకే గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. ఏటా కనీసం 60 రోజులు చట్టసభలు పనిచేయాలని, అప్పుడే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మహాసభలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ కూడా పాల్గొన్నారు.
