గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో, గత నాలుగేళ్లుగా 201 కేసుల్లో పట్టుబడిన సుమారు 12,570 కేజీల గంజాయిని నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు. కాపుల ఉప్పాడలోని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ భారీ నిల్వలను తగులబెట్టారు. దీని విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా.

గంజాయి విక్రయిస్తున్న 17 మందిపై PIT NDPS చట్టం కింద కేసులు నమోదు చేయగా, ఇప్పటికే 14 మందిని జైలుకు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు.
జిల్లాలోని 5 సబ్ డివిజన్లలో గంజాయి నిర్మూలనకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన భవనాలపై డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు. గంజాయి విక్రయాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. “గంజాయి మహమ్మారిని జిల్లా నుండి తరిమికొట్టేందుకు ప్రజలు సహకరించాలి. ఎక్కడైనా గంజాయి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వండి” అని ఎస్పీ కోరారు.
