తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం (ఫిబ్రవరి 1, 2026) ఆందోళన బాట పట్టారు. జిల్లాలోని బీబీపేట, పాల్వంచ మండల కేంద్రాల్లో ప్రధాన రహదారులపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్షతో కేసీఆర్ను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. తప్పుడు కేసులతో ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మండల కేంద్రాల్లోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి, సిట్ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కట్టుకథలు సృష్టించి, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన నేతను విచారణ పేరుతో వేధించడం దుర్మార్గమని వారు ధ్వజమెత్తారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో సిట్ అధికారులు కేసీఆర్ను సుమారు నాలుగు గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.
