అర్థరాత్రి వేళ నడిరోడ్డుపై తల్వార్లతో కేక్ కట్ చేస్తూ బీభత్సం సృష్టించిన రౌడీ గ్యాంగ్ను కరీంనగర్ రూరల్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. తీగలగుట్టపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
అసలేం జరిగిందంటే? జనవరి 31 అర్థరాత్రి 12 గంటల సమయంలో హనుమాన్ నగర్లో ఒక మైనర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో యువకులు కారుపైకి ఎక్కి తల్వార్లతో కేక్ కట్ చేస్తూ, బాణాసంచా కాలుస్తూ హంగామా చేశారు. అదే సమయంలో పని ముగించుకుని వస్తున్న యుగంధర్, చరణ్ అనే వ్యక్తులపై ఈ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి చేసింది. వారి వద్ద ఉన్న రూ. 2 వేల నగదుతో పాటు, సుమారు రూ. 40 వేల విలువైన రెండు మొబైల్ ఫోన్లను లాక్కుని ధ్వంసం చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు మేజర్లు (వాలకుంట్ల అజయ్, ముక్కెర విఘ్నేష్, గుంజ రంజిత్) కాగా, మిగిలిన ఆరుగురు మైనర్లు అని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఛరించారు.
