మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన తన రాజకీయ స్థితిగతులు మరియు మున్సిపల్ ఎన్నికల్లో తన వైఖరిని స్పష్టం చేశారు.
“నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. ఆ పార్టీ తరపునే గెలిచాను. ఇప్పటికీ నా జీతం నుండి నెలకు రూ. 5000 బీఆర్ఎస్ పార్టీ లెవీ కింద కట్ అవుతున్నాయి. అఫిడవిట్లో కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేననే పేర్కొన్నాను. అసెంబ్లీలో పార్టీ విప్ జారీ చేస్తే కచ్చితంగా పాటిస్తా.” పార్టీకి తాను ఎప్పుడూ దూరం కాలేదని, కేవలం జగిత్యాల అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని వెల్లడించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకత్వమే తనకు దూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన అనుచరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. జగిత్యాల అభివృద్ధిని ఆకాంక్షించే ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, కాంగ్రెస్ మరియు తన అభివృద్ధి ఆలోచనలకు మద్దతుగా ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
