వెనుకబడిన వర్గాలను కేవలం లబ్ధిదారులుగానే కాకుండా, వారిని మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా మరియు MSMEలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కులవృత్తుల వారికి ఆధునిక పరికరాలను పంపిణీ చేసేందుకు ‘ఆదరణ-3’ పథకం ద్వారా తక్షణ చర్యలు చేపట్టాలని CM ఆదేశించారు. రాష్ట్రంలోని 6 మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక BC రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుపై కసరత్తు చేయాలని సూచించారు. రూ. 60 కోట్ల సాస్కి (SASKI) నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.మార్చి నాటికి 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో రూ. 17 కోట్లతో సురక్షిత తాగునీటి కోసం ఆర్వో (RO) ప్లాంట్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పర్యావరణ హితమైన ‘నెట్ జీరో’ కాన్సెప్టును అమలు చేయాలని సూచించారు. బీసీ విద్యార్థుల విద్యాపరమైన పురోగతిని పర్యవేక్షించేందుకు అపార్ (APAAR) ఐడీలను అనుసంధానం చేయాలని ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బీసీ భవనాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.
