రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో ఒక పాడుబడిన ఇంట్లో పెద్దపులి చేరడం తీవ్ర కలకలం రేపింది. ఆ ఇంటి నుంచి వస్తున్న పులి గాండ్రింపులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
గ్రామం నడిబొడ్డున ఉన్న ఒక పాత ఇంట్లో పులి గాండ్రింపులు వినిపించడంతో గ్రామస్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. కేశవరం కొండల ప్రాంతం నుండి అటవీ శాఖ అధికారుల బృందాలు హుటాహుటిన కూర్మాపురానికి బయలుదేరాయి. పులిని బంధించేందుకు మత్తు ఇంజక్షన్లు, బోన్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.పాడుబడిన ఇంట్లో పులి కదలికలను డ్రోన్ కెమెరాల ద్వారా అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.ఇప్పటికే ఈ పులి చుట్టుపక్కల మండలాల్లో పలు పశువులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు ‘ఆపరేషన్ టైగర్’ను ముమ్మరం చేశారు.
